కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్ను తాము తిరస్కరించామని చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం మమత ఈ విషయాన్ని వెల్లడించారు. నాలుగైదు ఏండ్ల కిందట ఇది జరిగిందని తెలిపారు. ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్, పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించిందని చెప్పారు. రూ. 25 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. అయితే న్యాయమూర్తులు, అధికారులకు వ్యతిరేకంగా వినియోగించడంతోపాటు రాజకీయంగా దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో తాను తిరస్కరించానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ అంశం పలుసార్లు కుదిపేసింది. పలువురు జర్నలిస్టులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సైనిక అధికారులు, న్యాయమూర్తులు, పలు రంగాలకు చెందిన ఉన్నతాధికారుల మొబైల్ ఫోన్లపై పెగాసస్ స్పైవేర్తో కేంద్రం నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. రాహుల్ గాంధీతోపాటు మమతా మేనల్లుడు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పలు వార్తా కథనాలను ది వైర్ ప్రచురించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతోపాటు సీఎం మమతా బెనర్జీ కూడా పెగాసస్ స్పైవేర్ వివాదంపై గళమెత్తారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అంతే కాకుండా గత ఏడాది పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముందు పెగాసస్ స్పైవేర్పై బెంగాల్ ప్రభుత్వపరంగా దర్యాప్తునకు ఆదేశించారు. ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీతో దర్యాప్తునకు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని మమత ప్రకటించారు.
అయితే పెగాసస్ స్పైవేర్ అంశంపై దర్యాప్తునకు సాంకేతిక నిణుఫులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వ దర్యాప్తును సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది.
They (NSO Group, Israeli cyber intelligence company) had come to our police dept 4-5yrs ago to sell their machine (Pegasus spyware) & demanded Rs 25cr; I turned it down as it could have been used politically, against judges/officials, which is not acceptable:WB CM Mamata Banerjee pic.twitter.com/WTnAq8MWyh
— ANI (@ANI) March 17, 2022