ఇండోర్, జనవరి 9: విదేశాల్లో ప్రవాస భారతీయులే భారత్కు ‘బ్రాండ్ అంబాసిడర్ల’ని ప్రధాని మోదీ అభివర్ణించారు. సోమవారం ఇండోర్లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ప్రధాని ప్రారంభించారు. రిపబ్లిక్ ఆఫ్ సూరినామ్ అధ్యక్షుడు చంద్రికా పెర్సద్ సంతోఖీ ప్రత్యేక అతిథిగా, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రవాస భారతీయులు యోగా, ఆయుర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్త కళలు, చిరు ధాన్యాలకు బ్రాండ్ అంబాసిడర్లని మోదీ అన్నారు. దేశ, విదేశాల్లో జాతి నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేసిన కృషిని గ్రంథస్థం చేయాలని భారత్లోని యూనివర్సిటీలను ఆయన కోరారు.
ప్రవాస భారతీయులకు అవమానం
ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో గందరగోళం నెలకొన్నట్లు ప్రవాస భారతీయులు ఆరోపిస్తున్నారు. పాస్లు ఉన్నప్పటికీ హాల్లోకి అనుమతించకుండా అవమానించారని మండిపడ్డారు. ప్రధాని వస్తున్నాడనే సాకుతో ఆహ్వానితులను బయటకు పంపించినట్లు ఆరోపించారు. కార్యక్రమం ప్రారంభమై రెండు రోజులవుతున్నా… సరైన ఏర్పాట్లు చేయలేదని తెలంగాణ నుంచి పాల్గొన్న కోటపాటి నరసింహనాయుడు ఆరోపించారు.