మొన్నటి వరకూ భారత్లో రైతులు ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం చాలా రోజుల పాటు సాగింది. ఇప్పుడు దాయాది పాకిస్తాన్లో రైతుల ఉద్యమం ప్రారంభమైంది. పాక్లోని పంజాబ్ ప్రాంతంలో రైతులు రోడ్డెక్కి, ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. గోధుమ పంటకు మద్దతు ధర, అధిక కరెంట్ బిల్లులతో పాటు మరికొన్ని అంశాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పాక్ పత్రిక డాన్ ప్రముఖంగా పేర్కొంది. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోకపోవడం వల్లే రైతులు రోడ్డెక్కినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
రైతు సంఘం నేతల సారథ్యంలో ఓ బృందం స్థానిక అధికారులతో చర్చలు జరిపింది. అవి విఫలం చెందడంతో తాము తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని రైతు ప్రతినిధులు ప్రకటించారు. పెద్ద ఎత్తున రైతులు బ్యానర్లు చేత పట్టుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకెక్కారు. అయితే రైతులతో చర్చించడానికి ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంటాయని స్థానిక ఉన్నతాధికారులు ప్రకటించారు. రైతులు లేవనెత్తిన రెండు అంశాలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు పేర్కొన్నారు.