Notice to Rahul | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటిసిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్సభలో చేసిన అన్పార్లమెంటరీ వ్యాఖ్యలపై రాహుల్ను సమాధానం కోరింది. ఈ నెల 15 వ తేదీలోగా సమాధానం తెలియజేయాలని నోటీసులో స్పష్టం చేసింది. రాహుల్ గాంధీపై బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ నోటీసును పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇచ్చారు.
ఇదే విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తూ.. రూల్ 380 ప్రకారం రాహుల్ గాంధీ చేసిన కొన్ని అన్పార్లమెంటరీ, అప్రతిష్ట ఆరోపణలను సభా కార్యకలాపాల రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద ఇచ్చిన నోటీసును రాహుల్కు అందించి సమాధానం కోరాలని సూచించారు. దాంతో లోక్సభ సెక్రటేరియట్ రాహుల్గాంధీకి ఆదివారం సాయంత్రం నోటీసు జారీ చేసింది. ఈ నెల 7 న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దాలని, అన్పార్లమెంటరీగా ఉండటమే కాకుండా వాస్తవాలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద ఒకేసారి ఉల్కాపాతంగా పెరిగిందని పేర్కొన్నాడు. రాహుల్ వ్యాఖ్యలను అధికార పక్షం సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నేలబారు విమర్శలు చేయడం మానుకోవాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సూచించారు.