డెహ్రాడూన్, నవంబర్ 14: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కమీషన్ సర్కార్గా మారిపోయిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఏ పని చేయాలన్నా కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి మేం విడిపోకముందు అక్కడ 20 శాతం కమీషన్ ఉండేది. వేరే రాష్ట్రంగా మారాక ఈ సమస్య ఉండదని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ 20 శాతం కమీషన్ కొనసాగుతున్నది’ అని ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఉత్తరాఖండ్ను పాలిస్తున్నది బీజేపీయే. ఆ పార్టీకి చెందిన ఎంపీయే సంచలన వ్యాఖ్యలు చేయటం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు.. బీజేపీ పాలిత కర్ణాటకలోనూ కమీషన్రాజ్పై ప్రతిపక్షాలు, కాంట్రాక్టర్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఏకంగా 40 శాతం కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పలువురు బాధితులు పేర్కొనటం గమనార్హం.