శ్రీనగర్: ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) జరిగే అవకాశం ఉంటుందేమోనని చెప్పారు. అయితే దానితో పెద్దగా లాభమేమీ ఉండదన్నారు. ఢిల్లీ బాంబు దాడికి సంబంధించి.. ఆ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?. దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు, అధ్యయనం జరగాల్సి అవసరం ఉన్నదని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. మనవాళ్లు 18 మంది మరణించారు. రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్) తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను ఆశిస్తున్నాను. అదొక్కటే ఏకైక మార్గం. స్నేహితులను మార్చవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేమంటూ మాజీ ప్రధాని వాజ్పేయి చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు.
ఢిల్లీలో దాడి కోసం డాక్టర్లు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?, దానికి గల కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో మరో ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమం జరగకూడదని ఆశిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా శ్రీనగర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనపై స్పందిస్తూ.. అధికారులు పేలుడు పదార్థాలను సరిగా నిర్వహించలేదని పేర్కొన్నారు. ఇది మనం చేసుకున్న తప్పని, పేలుడు పదార్థాల గురించి అవగాహన ఉన్నవారు వాటిని ఎలా నిర్వహించాలో అధికారులతో మాట్లాడి ఉండాల్సిందని చెప్పారు. అలా చేయకుండా వారే స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నించారని విమర్శించారు. జరిగిన నష్టాన్ని అందరూ చూశారని, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అక్కడున్న ఇండ్లకు చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఢిల్లీ సంక్షోభం నుంచి మనం ఇంకా బయటపడలేదని చెప్పారు.