దేశ చరిత్రలో అతిపెద్ద వైఫల్యంగా, చారిత్రక తప్పిదంగా ‘పెద్ద నోట్ల రద్దు’ నిలిచింది. నల్లధనం, ఉగ్రవాదానికి నిధుల కట్టడి పేరిట ప్రధాని మోదీ తీసుకొన్న ఈ అనాలోచిత నిర్ణయంతో సామాన్యులు అరిగోసలు పడ్డారు. నగదు కోసం రోజుల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ‘నోట్ల రద్దు’ కారణంగా మరణించిన వారి సమాచారం తమ దగ్గర లేదని ఎప్పటిలాగే ‘నో డాటా అవైలబుల్’ (ఎన్డీఏ) అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తప్పించుకోవాలని చూసింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో నలుగురు మరణించినట్టు చెప్పుకొచ్చింది. అయితే, మీడియా సంస్థల సమాచారం మేరకు ‘నోట్ల రద్దు’ కారణంగా దేశవ్యాప్తంగా 108 మంది పౌరులు మరణించినట్టు తెలుస్తున్నది. లెక్కలోకి రానివారు ఇంకెంత మంది ఉంటారో తెలియదు. మరోవైపు, నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
జీడీపీ వృద్ధి రేటులో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం, హెల్త్కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, మ్యాను ఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఏవియేషన్, ఆటోమొబైల్ తదితర రంగాలపై ‘నోట్ల రద్దు’ నిర్ణయం తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా 1.4 లక్షల పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. 62 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డునపడ్డారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘పెద్ద నోట్ల రద్దు’ అంటూ ఆరున్నరేండ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. దేశ జీడీపీ వృద్ధికి కీలకంగా పరిగణించే వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం, హెల్త్కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఏవియేషన్, ఆటోమొబైల్ తదితర పదికి పైగా రంగాలు కుదేలయ్యాయి. ఈ ప్రభావంతో దాదాపు 62 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. 1.4 లక్షల పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి.
ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది
మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఏవియేషన్, టెలికం ఇలా మరికొన్ని రంగాలపై కూడా నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. నగదు చలామణిలో లేకపోవడం ఒకవైపు, డిజిటల్ చెల్లింపులపై అప్పట్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక పలువురు కంపెనీలను మూసివేశారు. దీంతో లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. ఆటోమొబైల్ సేల్స్ 70 శాతం వరకూ పడిపోయాయి. మొత్తంగా రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లినట్టు ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రంగం: వ్యవసాయం
జీడీపీలో వాటా: 20.19%
నోట్ల రద్దు వల్ల నష్టం: రూ. లక్ష కోట్లు
ఏం జరిగింది: ఎరువులు, విత్తనాలు కొనేందుకు నగదు లేదు. సాగు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు పైసలు లేవు. ధాన్యాన్ని విక్రయిద్దామంటే కొనడానికి ఎవరూ లేరు. దీంతో రైతన్నలు అరిగోస పడ్డారు. ఆర్థిక కష్టాలు అనుభవించారు.
వివరణ: ప్రధాని మోదీ తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల వ్యవసాయరంగం కుదేలైంది. దీనికి కారణం.. నోట్ల రద్దు ప్రకటన సరిగ్గా యాసంగి సాగుకు ముందు, వానాకాలం కోతల తర్వాత వెలువడటమే. జీడీపీలో వ్యవసాయం వాటా 20.19 శాతంగా ఉన్నది. దేశంలోని 60 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయితే యాసంగిలో పెద్దయెత్తున ధాన్యాన్ని పండించాలన్న రైతన్నల ఆశలపై, వానాకాలంలో పెద్ద మొత్తంలో చేతికొచ్చిన పంటను విక్రయించాలనుకొన్న అన్నదాతల కలలపై ఒకే ఒక్క ప్రకటనతో మోదీ నీళ్లుచల్లారు.
యాసంగి కోసం.. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడానికి అన్నదాతలు పెద్దయెత్తున ఇండ్లల్లో నగదును దాచుకొన్నారు. అయితే, రాత్రికి రాత్రి వెలువడిన ‘పెద్ద నోట్ల రద్దు’ ప్రకటనతో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక దుకాణదారులు పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. డిజిటల్ పేమెంట్ల వాడకం అప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతన్నలు యాసంగి కాలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ దగ్గర 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు అలాగే ఉండిపోయాయంటే పరిస్థితి ఏ స్థాయిలో అదుపుతప్పిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, అప్పటికే, పంట వేసిన రైతన్నలు కూలీలకు నగదు ఇవ్వలేక కోతలను నిలిపేశారు. దీంతో వేలాది మంది రైతు కూలీలు ఉపాధి కోల్పోయారు. ఇక, అప్పటికే చేతికొచ్చిన పంటను విపణిలో విక్రయించడానికి చిన్న, సన్నకారు రైతులు అరిగోసలు పడ్డారు. ఇలా మొత్తంగా ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం వల్ల రెండేండ్లపాటు సాగురంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. దాదాపు రూ. లక్ష కోట్ల వరకు ఉత్పత్తిపై ప్రభావం పడ్డట్టు అంచనా.
రుణ భారం పెరిగిపోయింది
నోట్ల రద్దు వల్ల అన్నదాతలు చెప్పలేనన్ని అవస్థల్ని ఎదుర్కొన్నారు. రైతులు ఎక్కువగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో వారికి సంప్రదాయ వడ్డీ రేటుకు అప్పు పుట్టలేదు. రెట్టింపు వడ్డీకి గానీ రుణాలు దొరుకలేదు. దాదాపు ఆరు మాసాల పాటు రైతులు కష్టాలు పడ్డారు. వ్యవసాయ పెట్టుబడి ఎక్కువ అయ్యింది. పం టకు గిట్టబాటు ధర దక్కలేదు. నోట్ల రద్దుతో రైతు నష్టపోయే మొత్తం రెట్టింపయ్యింది. ఆ మేరకు రుణ భారం కూడా పెరిగింది.
– శాంతకుమార్, రైతు సంఘం నేత
రంగం: హెల్త్కేర్
జీడీపీలో వాటా: 3 శాతం
నోట్ల రద్దు వల్ల నష్టం: రూ. 30 వేల కోట్లు
ఏం జరిగింది: పాత నోట్లు తీసుకురావడంతో చాలా దవాఖానల్లో వైద్యాన్ని నిరాకరించారు. దీంతో పలువురు మృత్యువాతపడ్డారు. మందుల కొనుగోలు ప్రక్రియలో మెడికల్ దుకాణాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
వివరణ: జీడీపీలో దీని వాటా 3 శాతంగా ఉన్నది. రూ. 7 లక్షల కోట్ల మేర వ్యాపారం హెల్త్కేర్ రంగానిదే. అయితే, నోట్లను రద్దు చేయడంతో పాత నోట్లను తీసుకొచ్చిన రోగులకు చికిత్స చేయడానికి కొన్ని దవాఖానలు నిరాకరించాయి. దీంతో పలువురు మరణించారు. ఫార్మా కంపెనీల నుంచి మందుల కొనుగోలుకు మెడికల్ దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు.
రంగం: రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం
జీడీపీలో వాటా: 15 శాతం
నోట్ల రద్దు వల్ల నష్టం: రూ. 95 వేల కోట్లు
ఏం జరిగింది: నగదు కొరతతో భూముల రిజిస్ట్రేషన్లు 40 శాతం మేర తగ్గాయి. భూముల క్రయవిక్రయాలు, నిర్మాణాలు 60 శాతం వరకూ నిలిచిపోయాయి.
వివరణ: నోట్ల రద్దు నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్తో పాటు గృహ నిర్మాణ రంగం పూర్తిగా పడకేసింది. చేతిలో నగదు లేకపోవడంతో భూములు, గృహాలను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలను నగదు రూపంలోనే ఎక్కువగా చెల్లిస్తుండటంతో క్రయ విక్రయాలతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పెద్దయెత్తున నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. నగదు కొరతతో అప్పటికే సిద్ధంగా ఉన్న కొన్ని గృహాలు, భవంతులను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కొత్త నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది నిర్మాణరంగ కార్మికులు, కూలీలకు ఉపాధి కరువైంది. మొత్తంగా.. జీడీపీలో 15 శాతం వాటా కలిగిన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగం.. ‘పెద్ద నోట్ల రద్దు’ కారణంగా రూ. 95 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చవిచూసింది.
రంగం: టూరిజం
జీడీపీలో వాటా: 6.5 శాతం
నోట్ల రద్దు వల్ల నష్టం: రూ. 89 వేల కోట్లు
ఏం జరిగింది: నగదు కొరతతో వేలాదిమంది పర్యటనలను వాయిదా వేసుకొన్నారు. హోటల్ బుకింగ్స్ 70% మేర తగ్గిపోయాయి. దీంతో టూరిజం, ఆతిథ్య సేవా రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వారిలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
వివరణ: దేశ జీడీపీలో పర్యాటకం, ఆతిథ్య రంగం వాటా 6.5 శాతంగా ఉన్నది. రూ. 15 లక్షల కోట్ల వ్యాపారం ఇండియన్ టూరిజం సెక్టార్లో జరుగుతున్నట్టు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ నివేదిక చెప్పింది. ఈ రంగం ద్వారా 3.3 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్టు వెల్లడించింది. అయితే, ‘నోట్ల రద్దు’ ప్రకటన వెలువడగానే హోటల్ బుకింగ్స్, టూరిస్ట్ డెస్టినేషన్ బుకింగ్స్ 70 శాతం వరకు తగ్గిపోయినట్టు నిర్వహకులు వాపోయారు. కస్టమర్లు లేకపోవడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. దాదాపు 10 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
పాతిక శాతం వ్యాపారం పడిపోయింది
ప్రధాని మోదీ రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేశారు. దాదాపు నెలరోజుల పాటు దైనందిన లావాదేవీలకు ఇబ్బంది పడ్డాం. బ్యాంకుల్లో చాలా పరిమిత మొత్తానికి పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చేవారు. అవి మా అవసరాలకు ఏమాత్రం సరిపోయేవి కాదు. పాతిక శాతం వ్యాపారాన్ని పోగొట్టుకున్నాం. డబ్బులు లేక పోవటంతో కస్టమర్లు ఇతర ప్రాంతాల నుంచి రావటం బాగా తగ్గించారు. స్టార్ హోటళ్ల వారు యాభై శాతం వరకూ వ్యాపారాన్ని కోల్పోయినట్లు అంచనా.
– గంగరాజు, హోటల్ నిర్వాహకుడు
రంగం: బ్యాంకింగ్
జీడీపీలో వాటా: 23 శాతం
నోట్ల రద్దు వల్ల నష్టం: రూ. 50 వేల కోట్లు
ఏం జరిగింది: పాత నోట్ల రద్దు ఒకవైపు, కొత్త నోట్లు అందుబాటులోకి రావడంలో జాప్యం వెరసి నగదు చలామణిలో ఇబ్బందులు ఎదురై వేలాది ప్రైవేట్ ఆర్థిక సంస్థలు మూతబడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. వివరణ: దేశ జీడీపీలో సేవారంగానిది 50 శాతం వాటా. ఇందులో 23 శాతం వరకు ఆర్థిక సేవలే. నోట్ల రద్దు నిర్ణయంతో నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది. కొత్తగా రూ. 2000. రూ. 500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, విపణిలోకి అవి పూర్తిస్థాయిలో రావడానికి రెండు నెలల సమయం పట్టింది. ఈ జాప్యం కారణంగా వేలాది ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు మూతబడ్డాయి. నగదు కొరతతో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ బ్యాంకులు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. లావాదేవీల్లో స్తబ్ధతతో రూ. 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిన కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి ఆరున్నరేండ్లు గడిచింది. నకిలీ నోట్లు, నల్లధనాన్ని అరికట్టడంతో పాటు దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు అంటూ కేంద్రం చెప్పిన మాటలు డొల్లేనని, తక్కువ నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ(లెస్ క్యాష్ ఎకానమీ) అనేది కలేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి దేశ ఆర్థికవ్యవస్థలో రూ.13 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉండగా.. 2022, మార్చి నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరిందని సోమవారం లోక్సభలో వెల్లడించడం ద్వారా నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందని కేంద్రమే అంగీకరించిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. నోట్లరద్దుతో నగదు చెలామణిని తగ్గించడం ద్వారా నల్లధనాన్ని అరికడుతామని కేంద్రం చెప్పుకొచ్చింది.
అన్నీ సర్కారు హత్యలే
లెక్కల్లోకి రాని పౌరులు ఇంకెంత మందో..
మరణించిన వారి డాటా తొలుత లేదన్న కేంద్రం
విమర్శలతో నలుగురు చనిపోయినట్టు వెల్లడి
నోట్లరద్దుతో పోయిన తొలి ప్రాణం
కిరణ్, జగదీశ్ దంపతులకు బిడ్డ పుట్టి మూడు రోజులైంది. అప్పటికి నోట్లరద్దు ప్రకటించి కేవలం నాలుగురోజులే అయ్యింది. దవాఖానలో చేరినప్పుడు కొంత మొత్తం డిపాజిట్ కింద చెల్లించారు. అయితే ఆ నోట్లు ఇప్పుడు చెల్లవని దవాఖాన యాజమాన్యం పేచీ పెట్టింది. అంతేకాకుండా బిడ్డకు చికిత్స అందించాలంటే మొత్తం డబ్బు కట్టితీరాల్సిందేనని పట్టుపట్టింది. దీంతో పసిపిల్లవాడి ప్రాణాలు నిలువలేదు. దేశంలో నోట్లరద్దు తర్వాత నమోదైన తొలి మరణంగా దీన్ని మీడియా బయటపెట్టింది. ముంబైలోని గోవాండిలో ఈ సంఘటన జరిగింది
పెండ్లి ఆగింది.. గుండె పగిలింది
రాజ్కోట్కు చెందిన మహేశ్భాయ్ సుమ్రా(45) డ్రైవర్గా పనిచేసేవాడు. నెలకు పదివేల దాకా సంపాదించేవాడు. 2016 డిసెంబర్ 9న కూతురు ఆర్తి పెండ్లి పెట్టుకున్నాడు. ఇందుకోసం అక్టోబర్లోనే పెండ్లికి కావాల్సిన చీరలు, నగలు అప్పు చేసి కొన్నాడు. ఈలోగా అనుకోని ఉత్పాతం నోట్ల రద్దు రూపంలో వచ్చిపడింది. అప్పటికే చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలీక నవంబర్ 22న ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
చేతిలో నగదు లేక.. పిల్లల ఆకలి తీర్చలేక..
మాల్దా నివాసి గోవింద్ సర్కార్(45) ఓ దినసరి కూలీ. నోట్లరద్దుతో ఉన్న కొద్ది పాటి నగదుతో కొన్నాళ్లు నెట్టకొచ్చిన గోవింద్కు ఆ తర్వాత చేతిలో చిల్లిగవ్వలేక పిల్లలకు తిండిపెట్టలేకపోయాడు. పిల్లలకు తిండికూడా పెట్టలేని స్థితికి చితికిపోయాడు. నవంబర్ 19న పిల్లలు స్కూల్కు పోగానే ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.
వర్కర్లకు జీతాలు చెల్లించలేక
హౌరాకు చెందిన దేబాశిష్ భక్తా (55) మరణం మరో దారుణం. దేబాశీష్కు ఇటుక బట్టీ, ,జువెల్లరీ షాప్ ఉన్నాయి. నోట్లరద్దు వల్ల వర్కర్లకు జీతాలు చెల్లించలేని స్థితికి వచ్చాడు. ప్రతి వారం 250 మంది వర్కర్లకు రెండు లక్షల రూపాయలను నగదు రూపంలో చెల్లించేవాడు. చేతిలో డబ్బుల్లేక వర్కర్లకు పేమెంట్ చేయలేకపోయాడు. దీంతో వర్కర్లు పనిమానేశారు. బుక్ చేసుకున్న ఆర్డర్లకు వస్తువులు సరఫరా చేయలేక నానా ఇబ్బందులు పడ్డాడు. దీంతో మానసికంగా బాగా కృంగిపోయి 2016 డిసెంబర్ 24న బెడ్రూమ్లో గొంతుకోసుకుని చనిపోయాడు.
క్యూలో నిలబడే కుప్పకూలిపోయారు
కేరళకు చెందిన సుబ్రమణియన్(72) ఓ రైతు. నోట్లరద్దుతో నగదు అవసరమైనప్పుడల్లా ఇంటికి 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఇంటి అవసరాలతోపాటు పొలం పనులకు డబ్బు అవసరమొచ్చి డిసెంబర్ 3న బ్యాంకుకు వెళ్లాడు. అప్పటికే భారీ క్యూ ఉంది. చేసేదేమీలేక క్యూలో నిల్చున్న సుబ్రమణియన్ కాసేపటికి అక్కడే కుప్పకూలాడు.
సీనియర్ సిటిజన్లపై కనికరం లేక
మనుశుక్లా మఖ్వానా(69). సీనియర్ సిటిజన్. నోట్లరద్దు ప్రకటన టీవీల్లో చూసి షాక్కు గురయ్యారు. నోట్లరద్దు జరిగిన కొన్నాళ్లకు మనుశుక్లా మఖ్వానా బ్యాంకుకు వెళ్లారు. అక్కడ భారీ క్యూ లైన్ ఉంది. అసలే హైపర్టెన్షన్తో పాటు గుండె బలహీనంగా ఉండే శుక్లా తోటి వారితో ఇదే విషయమై మాట్లాడుతుండగా ఛాతినొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
నగదు లేక వైద్యం అందక..
గణేశ్ విశాఖపట్టణంలో నివసిస్తారు. నవంబర్ మొదటి వారంలో ఆయన కూతురు కోమలికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఓ ప్రైవేటు దవాఖానలో చేర్చారు. డాక్టర్ ఆమెకు కొన్ని రక్తపరీక్షలు చేయించాలని చెప్తూ కొన్ని మందులు రాసిచ్చారు. అప్పుడే పెద్దనోట్ల రద్దు అమలైంది. మెడికల్ షాప్లో డెబిట్ కార్డును కూడా ఒప్పుకోలేదు. దీంతో ఎంతో అత్యవసరమైన మందులు కొనలేకపోయాడు. ఫలితంగా ఆ రాత్రే ఆయన కూతురు కోమలి చనిపోయింది.
ఉత్తరప్రదేశ్-28
బెంగాల్-9
మధ్యప్రదేశ్-7
మహారాష్ట్ర-7
ఆంధ్రప్రదేశ్- 6
పంజాబ్-6
బీహార్-5
రాజస్థాన్-5
గుజరాత్-5
జార్ఖండ్-4
కేరళ-4
తెలంగాణ-4
ఢిల్లీ-4
హర్యానా-3
కర్ణాటక-2
చండీగఢ్-1
ఛత్తీస్గఢ్-1
జమ్ముకశ్మీర్-1
మణిపూర్ -1
ఒడిశా-1
తమిళనాడు-1
నోట్ల రద్దు బలిగొన్న ప్రాణాలపై సమగ్ర కథనం కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి లేదా కింది లింక్ను అనుసరించండి.
https://bit.ly/3LjvKyx