న్యూఢిల్లీ: రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. కశ్మీర్ సర్కారు తమకు ఈ విషయంలో భరోసా ఇస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జైరామ్ రమేశ్.. బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికే రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. కశ్మీర్లో పేలుళ్ల వెనుక రాహుల్ పాదయాత్రను ఆపే కుట్ర ఉందంటారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయం తనకు కచ్చితంగా తెలియదని అన్నారు.
అలాంటి కుట్ర ఏమైనా ఉంటే భద్రతా ఏజన్సీలే సమాచారం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు ఏ కుట్ర చేసినా రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రను ఆపలేరని మాత్రం తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర తమిళనాడులో మొదలై వివిధ రాష్ట్రాల మీదుగా ఇప్పుడు కశ్మీర్కు చేరింది.
కశ్మీర్లోనే రాహుల్గాంధీ తన పాదయాత్రకు ముగింపు పలకనున్నారు. అయితే రాహుల్ యాత్ర కశ్మీర్లో ప్రవేశించిన రెండు రోజులకే నర్వాల్ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ భద్రతపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.