కోల్కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎల్లప్పుడూ మండిపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఒక ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీ కాదన్నదని తన నమ్మకమని అన్నారు. అయితే బీజేపీలోని కొందరు అగ్ర నేతలు తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందుకే ప్రత్యర్థులపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అజెండా, పార్టీ అజెండా కలువకుండా చూడాలని ప్రధాని మోదీకి సూచించారు. కేంద్రం, బీజేపీ అజెండా ఒక్కటే కావడం దేశానికి మంచిది కాదన్నారు.
కాగా, కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ తీర్మానం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన తీర్మానం ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ‘పక్షపాత పనితీరు’కు వ్యతిరేకంగానే అని అన్నారు.
మరోవైపు బెంగాల్లోని అధికార టీఎంసీ మంత్రులు, ఆ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న తరుణంలో కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం ప్రాధానత్య సంతరించుకుంది.