కాలింపోంగ్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై టీఎంసీ దుష్ ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే గోర్ఖాలను వెళ్లగొడుతారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని, ఇంత వరకు ఎన్ఆర్సీ తీసుకురాలేదని, కానీ ఒకవేళ ఎన్ఆర్సీ అమలు చేస్తే, అప్పుడు ఒక గోర్ఖాను కూడా వెళ్లగొట్టమని షా తెలిపారు. ఇవాళ బెంగాల్లో పర్యటించిన ఆయన కాలింపోంగ్లో ప్రచారంలో పాల్గొన్నారు. కాలింపోంగ్ చాన్నాళ్లు నుంచి సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. 1986లో సీపీఎం వాళ్లు మిమ్మల్ని అణిచివేశారని, ఆ సమయంలో సుమారు 1200 మంది గోర్ఖాలు చనిపోయారని, మీకు న్యాయం జరగలేదని, దీదీ అధికారంలోకి వచ్చాక, అనేక మంది గోర్ఖాల ప్రాణం తీసిందన్నారు. కమలం పువ్వుకు ఓటు వేస్తే.. తమ ప్రభుత్వం ఏర్పడుతుందని, గోర్ఖాల ఊచకోతపై సిట్ వేసి, నేరస్థులను జైలుకు పంపిస్తామని మంత్రి అమిత్ షా అన్నారు.