న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యపై భారత్, చైనా (India China Talks) మధ్య మరోసారి చర్చలు జరిపాయి. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై మాట్లాడుకున్నాయి. అయితే సరిహద్దులో మోహరించిన సైనిక దళాల ఉపసంహరణతోనే ద్వైపాక్షిక సంబంధాల సాధారణ స్థితి పునరుద్ధరణకు వీలు కలుగుతుందని భారత్ స్పష్టం చేసింది. కాగా, చైనా రాజధాని బీజింగ్లో తొలిసారి ఈ సమావేశం జరుగడం విశేషం. భారత్, చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. 2019 జూలై తర్వాత ఇరు దేశాల మధ్య 14వ సమావేశం బుధవారం జరిగింది. అయితే దీని ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన తొలి వ్యక్తిగత సమావేశం కూడా ఇదే కావడం మరో విశేషం.
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నివారణకు 2020 మేలో డబ్ల్యూఎంసీసీ ఏర్పాటైంది. కరోనా వల్ల ఇప్పటి వరకు వర్చువల్గా మాత్రమే సమావేశాలు జరిగాయి. అయితే బీజింగ్లో బుధవారం తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్తోపాటు మిగిలిన ప్రాంతాలలో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో కొనసాగించాలని ప్రతిపాదించారు. దీని కోసం త్వరలో సీనియర్ కమాండర్ల 18వ రౌండ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజింగ్లో జరిగిన డబ్ల్యుఎంసీసీ తొలి వ్యక్తిగత సమావేశంలో భారత్ బృందం తరుఫున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నేతృత్వం వహించినట్లు పేర్కొంది. చైనా బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహించినట్లు వెల్లడించింది.