ముంబై, జూలై 31: మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతున్నది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను నాశనం చేసేందుకు తన ప్రయత్నాలను ఆపలేదు. పాత మిత్రుడు బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను నామరూపాల్లేకుండా చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. ఇందుకు పార్టీలో కీలకంగా ఉన్న ఎంపీ సంజయ్ రౌత్పై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉసిగొల్పింది.
కేంద్రం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించే, ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తిచూపే రౌత్ను పత్రాచాల్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు ముంబైలోని బాండుప్ ఏరియాలో ఉన్న రౌత్ ఇంటికి చేరుకొని సోదాలు ప్రారంభించారు. దాదాపు 10 గంటల పాటు రౌత్ను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అయితే ఆయన్ను అధికారులు అరెస్టు చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. రౌత్ ఇంటిలో రూ.11.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఈడీ కార్యాలయం వద్ద రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘వారు(ఈడీ) నన్ను అరెస్టు చేయబోతున్నది. నేను అరెస్టు కాబోతున్నాను’ అని పేర్కొన్నారు. ప్రాణాలు పోయినా తలొగ్గేది లేదని, శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.
రాజకీయ ప్రతీకారంతో మోదీ సర్కార్ను తనను టార్గెట్గా చేసుకున్నదని ఉదయం సోదాలు ప్రారంభమైన తర్వాత ట్విట్టర్లో స్పందించారు. తప్పుడు ఆధారాలతో తప్పుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ‘బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నా..ఎలాంటి కుంభకోణంతో నాకు సంబంధం లేదు’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ కేసులో జూలై 1న ఈడీ అధికారులు రౌత్ను దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించారు. తర్వాత మరోసారి విచారణకు రావాలని రెండుసార్లు సమన్లు ఇచ్చారు. అయితే ఈడీ విచారణకు రౌత్ హాజరుకాలేదు.
దేశంలో ఎంతోమందికి ఐటీ, ఈడీ, సీబీఐ నోటీసులు వస్తు న్నా.. సంజయ్ రౌత్నే పదేపదే ఎందుకు విచారించాలని ఈడీ అనుకుంటున్నదని ప్రతిపక్ష ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. సంజయ్ రౌత్పై ఈడీ చర్యలు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు సాక్ష్యమని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపలా, బయటా విపక్షాల గొంతుక లేకుండా చేయాలని చూస్తున్నదని దుయ్యబట్టారు.
శివసేన అధికార పత్రికలో ఆదివారం ప్రచురితమైన వ్యాసంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కాపాడుకునేందుకు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశామన్న విషయాన్ని రెబల్స్ గ్రూపు ఒప్పుకోవాలన్నారు. శివసేన హిందుత్వాన్ని వదిలేసినందువల్లే తిరుగుబాటు చేశామని చెప్పడం మానుకోవాలని సూచించారు.
ఈడీ సోదాల నేపథ్యంలో శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. రౌత్ను ఈడీ అరెస్టు చేయొచ్చని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా ఈడీ చేపడుతున్న చర్యలు.. తమ పార్టీని నాశనం చేసే కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. మాతోశ్రీ నివాసంలో ఠాణె జిల్లా పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. పార్టీని వీడి రెబల్ క్యాంపులో చేరుతున్న వారిపై విరుచుకుపడ్డారు. పార్టీ సహకారంతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తులు.. విధేయతకు పాతరేస్తున్నారని మండిపడ్డారు.