న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరుగనున్నది. ఎన్నిక కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 68శాతం ప్రకారం.. పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలి. ఈ క్రమంలో జూన్ 29న ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 20న నామినేషన్ పత్రాలను పరిశీలించనుండగా.. 22 వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఉప రాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థి నిర్ణీత ఫార్మాట్లో నింపి, ఎలక్టోర్ సభ్యుల్లో 20 మంది ప్రతిపాదించాల్సి ఉండగా.. అలాగే మరో 20 మంది ఆ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేసుకునే వీలున్నది. ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ రూ.15వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 788 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ఎన్నికలు ఆగస్ట్ 6న జరుగనుండగా.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాలు తమ తరఫున అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి.