న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ (Praful Patel) ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగింపు కోసం కోర్టుకు నివేదిక సమర్పించింది. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అజిత్ పవర్ వర్గం నేత ప్రపుల్ పటేల్కు ఈ మేరకు క్లిన్ చిట్ ఇచ్చింది. దీంతో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పౌర విమానయాన మంత్రిగా ఉన్నారు. 2006లో నాలుగు బోయింగ్ 777లను ఐదేళ్లపాటు ఎయిర్ ఇండియా లీజుకు తీసుకుంది. 2007 జూలై నుంచి కొత్త విమానాలు పొందాల్సి ఉంది. అయితే లీజు నిర్ణయం వల్ల ఐదు బోయింగ్ 777, ఐదు బోయింగ్ 737 విమానాలను 2007 నుంచి 2009 వరకు ఆ సంస్థ నిర్వహించలేదు.
మరోవైపు దీని వల్ల ఎయిర్ ఇండియాకు రూ.840 కోట్లు నష్టం వాటిల్లడంతోపాటు ఆ సంస్థ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శలు వచ్చాయి. విమానాలు లీజుకు ఇచ్చిన ప్రైవేట్ పార్టీలకు బాగా లబ్ధిచేకూరిందని, ప్రఫుల్ పటేల్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దీనిపై దర్యాప్తు చేపట్టింది.
కాగా, గత ఏడాది జూలైలో ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవర్, తన వర్గంతో కలిసి బీజేపీ, షిండే ప్రభుత్వంలో చేరారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు విమానాల లీజు కేసులో ప్రఫుల్ పటేల్ ‘ఎలాంటి తప్పు చేసినట్లు రుజువులు’ లేవని సీబీఐ తేల్చింది. ఈ కేసు దర్యాప్తు ముగింపు కోసం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే కేసు మూసివేత రిపోర్ట్ను ఆమోదించాలా లేదా దర్యాప్తును కొనసాగించాలా అన్నది సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించనున్నది.