దేశ రాజధానిలో మహిళల భద్రతపై సవాల్
మహిళల భద్రతను స్వాతి మలివాల్ తనిఖీ చేస్తుండగా ఘటన
బీజేపీ పాలనలో మహిళా కమిషన్ చైర్పర్సన్కే రక్షణ లేదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మహిళలకు లభిస్తున్న భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తానే వేధింపులకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెను వేధించడమే కాకుండా తన కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. అయితే పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేశారు. ఇటీవల ఢిల్లీకి సమీపంలోని కంజావాలాలో ఓ 20 ఏండ్ల యువతిని నలుగురు దుండగులు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకొని వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మహిళ భద్రతను తనిఖీ చేసేందుకు స్వాతి మలివాల్ గురువారం తెల్లవారుజామున తన బృందంతో బయలుదేరారు.
ఎయిమ్స్ సమీపంలో 47 ఏండ్ల వ్యక్తి మద్యం మత్తులో తనను వేధించాడని స్వాతి తెలిపారు. తాను వెంటనే అతడిని కారులోంచి లాగేందుకు ప్రయత్నించగా, కిటికీ అద్దాన్ని పైకి ఎత్తాడని, తన చేయి ఇరుక్కుపోయినా.. అలాగే 15 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడని చెప్పారు. తాను బస్టాండ్లో ఉండగా, తన బృందం కొంతదూరంలో ఉన్నారని, ఇంతలో అతడు కారులో వచ్చి తనను వచ్చి లోపల కూర్చోమన్నాడని, తాను తిరస్కరించడంతో వెళ్లిపోయి, కొద్దిసేపటికి మళ్లీ వచ్చాడని అన్నారు. ఈసారి మళ్లీ తనను వచ్చి కారులో కూర్చోమన్నాడని, తాను తిరస్కరించడంతో అసభ్యంగా దూషించాడని తెలిపారు.
తాను వెళ్లి అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా, కారు అద్దం పైకి ఎత్తి ముందుకు వెళ్లాడని, తన చేయి అద్దంలో ఇరుక్కుపోయినా అలాగే ఈడ్చుకొని వెళ్లాడని వివరించారు. ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్పర్సన్కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అంచనా వేయవచ్చని అన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
ఎల్జీ.. శాంతి భద్రతల సంగతి చూడండి: కేజ్రీ
స్వాతి మలివాల్ వేధింపులకు గురైన ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై విమర్శలు ఎక్కుపెడుతూ.. ఎల్జీ రాజకీయాలు పక్కనపెట్టి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘బీజేపీ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతలకు ఏమైంది? గూండాలకు అంత ధైర్యం ఎలా వచ్చింది. నగరంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా సురక్షితంగా లేరు. శాంతిభద్రతల పరిరక్షణే ఎల్జీకి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. కొద్దిరోజులు ఆయన రాజకీయాలు పక్కన పెట్టి శాంతిభద్రతపై దృష్టి పెడితే మేము కూడా సహకరిస్తాం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
సీసీటీవీలో రికార్డు అయిన స్వాతి మలివాల్ను ఈడ్చుకెళుతున్న దృశ్యం