న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్కు సంబంధించి దాని తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. ‘ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్తో ప్రభుత్వం ఏమైనా లావాదేవీలు జరిపిందా? ఒక వేళ జరిపితే ఆ వివరాలు ఏమిటి? ’ అని సీపీఎం ఎంపీ డాక్టర్ వి శివదాసన్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై సోమవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీతో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని వెల్లడించింది.
కాగా, నిఘా, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ వినియోగం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా క్యాబినెట్ సెక్రటేరియట్ వంటి ఇతర మంత్రిత్వ శాఖలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పెగాసస్ స్పైవేర్ ద్వారా అనేక మంది ప్రతిపక్ష నేతలు, న్యాయవ్యవస్థకు చెందిన వారు, ప్రభుత్వంపై విమర్శలు చేసే జర్నలిస్టులు, కొందరు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల సిబ్బంది, సైనిక అధికారులతోపాటు పలువురి మొబైల్ ఫోన్లు హ్యాక్ అయినట్లు ది వైర్ పలు సంచలన కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఈ అంశం కుదిపేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.