న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. (Lok Sabha Elections 2024) ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.
కాగా, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్ముకశ్మీర్లో ఐదు లోక్సభ స్థానాలు, లడఖ్లో ఒక ఎంపీ స్థానం ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1తో పోలింగ్ ముగుస్తాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.