ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) బీజేపీపై మండిపడ్డారు. 2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ఆదివారం పుణెలో ఆయన పార్టీ నిర్వహించిన ఆరోగ్య దూత్ అభియాన్ కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎవరైనా వ్యతిరేకిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడటం సష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
కాగా, 2005 నుంచి 2023 వరకు దేశవ్యాప్తంగా 6,000 కేసులపై ఈడీ దర్యాప్తు చేసిందని శరద్ పవార్ తెలిపారు. అయితే కేవలం 25 కేసుల్లో మాత్రమే గణనీయమైన పురోగతి కనిపించిందని చెప్పారు. 85 శాతం కేసులలో ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడూ ఈడీ చర్యను ఎదుర్కోలేదని శరద్ పవార్ ఆరోపించారు. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలపై విచారణలు ఆగిపోయాయని విమర్శించారు.
మరోవైపు ఎన్సీపీని చీల్చి షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవర్ వర్గాన్ని నిజమైన ఎన్సీపీగా ఈసీ గుర్తించడం, పార్టీ సింబల్ గడియారాన్ని ఆ వర్గానికి కేటాయించడంపై శరద్ పవార్ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అలాంటి నిర్ణయానికి ప్రజలు మద్దతు ఇవ్వరని చెప్పారు. తన తొలి ఎన్నికల్లో రెండు ఎడ్ల గుర్తుపై పోటీ చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల చిహ్నం కంటే ఆలోచనలు, భావజాలం చాలా ముఖ్యమని అన్నారు. తమ వర్గానికి ఈసీ కేటాయించిన కొత్త పేరు, సింబల్పై సోమవారం చర్చిస్తామని తెలిపారు.