బెంగళూరు: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోటా రద్దు అంశంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను జూలై నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు.. న్యాయ పరిధిలో ఉన్న అంశాలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని, వాటికి రాజకీయాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీనిపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ముస్లింలకు తమ పార్టీ రిజర్వేషన్లు ఉపసంహరించుకున్నట్లు అమిత్ షా గర్వంగా చెబుతున్నారన్నారు.
కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సొలిసిటర్ జనరల్గా, న్యాయవాదిగా మీరు వాదించవచ్చని, కానీ బహిరంగ ప్రదేశంలో మరొకరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు.