న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ 24 గంటల నగరాన్ని ఆవిష్కరించేలా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఢిల్లీ -2041 ముసాయిదాను రూపొందించింది. నైట్ ఎకానమీ, రవాణా సదుపాయాలు, అందరికీ అందుబాటు గృహాలు, కాలుష్యాన్ని నివారిస్తూ పచ్చదనానికి బాటలు వేసేలా ఈ ముసాయిదాకు డీడీఏ తుదిరూపు ఇచ్చింది.
ముసాయిదాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు డ్రాఫ్ట్ ను డీడీఏ ప్రజల ముందుంచింది. పూర్తి మౌలిక సదుపాయాలతో నివాస సముదాయాలు, వసతి గృహాలు, చిన్న ఇండ్లను రాబోయే 20 ఏండ్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ముసాయిదాలో ప్రణాళికలు రూపొందించారు.
ఇక అనధికార కాలనీలకు చెక్ పెడుతూ రాబోయే రోజుల్లో నగర పరిధిలో అర్బన్ విలేజ్ లను డెవలప్ చేస్తారు. మరోవైపు ఢిల్లీ జనాభా 2041 నాటికి 3.9 కోట్లకు పెరుగుతుందనే అంచనాతో మౌలిక వసతులను ఆ మేరకు మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని ముసాయిదా పేర్కొంది. నైట్ ఎకానమీ పాలసీ, మోడల్ షాప్స్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టానికి అనుగుణంగా 24 గంటల సిటీ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువెళ్లాలని ముసాయిదా సూచించింది.