Covid-19 Third Wave | కొన్ని రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటం రాబోయే థర్డ్ వేవ్కు సంకేతాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిపుణులు డాక్టర్ సామిరన్ పాండా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని సోమవారం తెలిపారు. పండుగల సీజన్లో సామూహిక వేడుకల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోతే అవి సూపర్ స్పెడింగ్ వేడుకలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ కంటే ముందుగా థర్డ్ వేవ్ దూసుకొస్తుందని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా చవి చూడని రాష్ట్రాల్లో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు ముందస్తుగా ఉపసంహరించొద్దని సూచించారు. మిజోరం, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.