న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ్ కా వికాస్. సబ్ కా విశ్వాస్’ నినాదమే తమ పాలనా విధానమని బీజేపీ గొప్పగా చెప్పుకొంటుంది. అలాంటి బీజేపీ నుంచి మరో నెల రోజులు గడిస్తే ఒక్క ముస్లిం ఎంపీ కూడా ప్రాతినిధ్యం వహించబోరు. ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా ఉండరు. లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. రాజ్యసభలో 245 సీట్లు ఉన్నాయి. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 4,908 సీట్లలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ప్రాతినిధ్యం ఉండకపోవడం గమనార్హం. ఈ పార్టీ నుంచి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీనే ప్రస్తుతానికి చివరి ముస్లిం ఎంపీ అవుతారు.
కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు
కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉంది. 17 రాష్ర్టాలు, యూటీల్లో అధికారంలో ఉంది. నఖ్వీని మళ్లీ నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ లిస్టులో ఆయన పేరు లేదు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 7తో ముగుస్తుంది. కొత్త లిస్టులో బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేరు. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ తరఫున ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. రాజ్యసభలో నఖ్వీ సహా ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మాజీ మంత్రి ఎంజే అక్బర్ పదవీ కాలం జూన్ 29న, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఆలం పదవీకాలం జూలై 4తో పూర్తి అవుతుంది. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీకాలం జూలై 7తో పూర్తి అవుతుంది.
లోక్సభలో చివరి ఎంపీ షానవాజ్
లోక్సభలో బీజేపీ తరఫున చివరి ముస్లిం ఎంపీ షానవాజ్ హుస్సేన్. 2009లో బీహార్లోని భాగల్పూర్ నుంచి గెలిచారు. 2014, 2019లో బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలుపొందలేదు. 2014లో బీజేపీ మొత్తం 482 మంది అభ్యర్థుల్లో కేవలం ఏడుగురు ముస్లింలకు మాత్రమే టికెట్ ఇచ్చింది. వీళ్లందరూ ఓడిపోయారు. 2019లో ఆరుగురిని నిలబెట్టింది. మళ్లీ ఒక్కరు కూడా గెలవలేదు.