LPG Charges : హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల నుంచి ఎల్పీజీ ఛార్జెస్ లేదా గ్యాస్ ఛార్జెస్ పేరిట అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ మార్కెట్లో ఎల్పీజీ సిలిండర్ దొరకడం లేదు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అందులోనూ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారానికి ఇబ్బందిగా మారింది. దీంతో చాలా మంది ఎక్కువ ధర పెట్టి బ్లాక్లో సిలిండర్లు కొంటున్నారు.
అయితే, ఈ ధరను ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై మోపుతున్నాయి. ఫుడ్ బిల్లులో ఐటమ్స్ ధరలు, జీఎస్టీతోపాటు ఎల్పీజీ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఎల్పీజీ ఛార్జెస్, గ్యాస్ ఛార్జెస్, ఫ్యుయెల్ కాస్ట్ రికవరీ అంటూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇకపై ఇలా ఎల్పీజీ ఛార్జీలు, ఫ్యుయెల్ ఛార్జీలు వసూలు చేయకూడదని రెస్టారెంట్లు, హోటళ్లను సీసీపీఏ (సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) హెచ్చరించింది. వీటికి చట్టబద్ధమైన అనుమతి లేదని, అలా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా వసూలు చేస్తుండటంతో వినియోగదారుల నుంచి చాలా ఫిర్యాదులు అందాయి. మెనూలో ఆహార పదార్థాల ధరలు, ట్యాక్సులకు అదనంగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. మీడియా ద్వారా సమాచారం అందడంతోపాటు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్కు ఫిర్యాదులు అందడంతో సీసీపీఏ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా ఇలాంటి అదనపు ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా కట్టాల్సిన అవసరం లేదు. వద్దనుకుంటే చెల్లించకుండా ఉండవచ్చు. కానీ, యాజమాన్యాలు కచ్చితంగా బిల్లు కట్టించుకుంటున్నాయి. అందుకే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం.. మెనూలో ఆహార పదార్థాలకు ఏ ధర ఉంటుందో అది మాత్రమే చెల్లించాలి. ట్యాక్సులు మాత్రం అదనం. ఒకవేళ వేరే ఛార్జీలు వసూలు చేస్తే వాటికి జరిమానా విధించే వీలుంది.