బెంగళూరు, డిసెంబర్ 22: కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని శనివారం నుంచి ఉపసంహరించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.
‘వస్త్రధారణ ఎంపిక ఒకరి సొంత హక్కు. అందరితో కలిసి అందరి వికాసం అన్న ప్రధాని మోదీ మాటలు బూటకం. బట్టలు, కులం ఆధారంగా బీజేపీ సమాజాన్ని, ప్రజలను విభజిస్తున్నది’ అని సిద్ధరామయ్య అన్నారు. అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించే సూచనలు కనిపిస్తున్నాయి. హిజాబ్ వివాదంపై తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.