Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో లొంగిపోయిన బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తన ధీనస్థితిని మీడియాకు చెప్పుకొచ్చారు. తన దగ్గర డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, సాయం చేయడానికి కూడా ఎవరూ లేరని చెప్పాడు. స్నేహితులు సహా ఎవరూ తనకు సాయం చేసేవారు లేరని, తానొక్కడినే ఈ పరిస్తితిని ఎదుర్కోవాల్సి ఉందని ఆవేదనగా చెప్పాడు.
తనకు డబ్బులు చెల్లించేందుకు ఏ మార్గమూ లేదన్నాడు. రాజ్పాల్ యాదవ్ కొంతకాలంగా రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అతడు ఆ డబ్బులు చెల్లించేందుకు సమయం అడుగుతూ వస్తున్నాడు. ఢిల్లీ కోర్టు గతంలో సమయం ఇచ్చింది. కానీ, ఈసారి మాత్రం అతడికి సమయం ఇవ్వలేదు. ఇచ్చిన గడువులోపు డబ్బులు చెల్లించనందున వెంటనే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఫిబ్రవరి 4న ఆదేశాలిచ్చింది. దీంతో గత గురువారం సాయంత్రం అతడు తిహార్ జైలు అధికారుల వద్ద లొంగిపోయాడు. డబ్బులు చెల్లించేందుకు మరికొంత గడువు కావాలని రాజ్పాల్ యాదవ్ లాయర్ కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పైగా అతడి వృత్తిని ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోలేమని కోర్టు చెప్పింది. చట్టం ముందు అందరూ సమానులే అని వ్యాఖ్యానించింది.
దీంతో అతడు జైలులో లొంగిపోయాడు. మరోవైపు అతడికి సాయం చేసేందుకు నటుడు సోనూ సూద్ ముందుకొచ్చారు. కొంత అమౌంట్ను అతడికి ఇచ్చేందుకు అంగీకరించాడు. ఇది దానంలాగానో, సేవలాగానో చూడక్కర్లేదని, వృత్తిపరమైన మద్దతుగా చూడాలని చెప్పాడు. నటుడిగా రాజ్పాల్ యాదవ్ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశాడని సోనూ సోద్ చెప్పుకొచ్చాడు. అతడికి తన సినిమాల్లో అవకాశాలిస్తానని, సినిమా రంగానికి చెందిన దర్శకులు, నటులు, నిర్మాతలు ఆయనకు మద్దతుగా నిలవాలని కోరాడు. రాజ్పాల్ తాజాగా నటించిన సినిమా భూత్ బంగ్లా. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 10న విడుదల కానుంది.