న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల మధ్య కేంద్రం ‘ముందు జాగ్రత్త’గా మూడో టీకా వేయనున్నది. అయితే, మూడో టీకాగా ఇందులో ఏ వ్యాక్సిన్ ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. వ్యాక్సిన్ మిక్సింగ్పై డేటా అందుబాటు లేకపోవడం వల్ల.. మిక్స్ అండ్ మ్యాచ్ ఉండదని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నారు. బూస్టర్ డోస్ (ముందు జాగ్రత్త) కింద ఒకటి, రెండు డోస్ కింద తీసుకున్న టీకానే ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్లైన్ కార్మికులకు ‘ముందు జాగ్రత్త మోతాదు’ను జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు టీకాలు తీసుకున్న వ్యక్తులకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఏది తీసుకుంటే అదే బూస్టర్ డోస్గా వేస్తారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించారు.
‘ముందు జాగ్రత్త టీకా’ రెండో డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వేస్తారని, హెల్త్కేర్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తొమ్మిది నెలల ముందు రెండో డోస్ టీకా తీసుకున్న వారికి మాత్రమే జనవరిలో టీకాలు వేయనున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. బూస్టర్ డోస్పై వివిధ అంశాలను పరిశీలించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ అన్నారు.
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ దానిపై అనేకసార్లు చర్చించడంతో పాటు ఆ సిఫారసులను నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యునైజేషన్ సబ్కమిటీకి పంపారు. టీకా నిర్వహణపై ప్రధాన సాంకేతిక సలహా బృందాని, అక్కడి నుంచి జాతీయ నిపుణుల బృందం వద్దకు వెళ్లుందని ఆ తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం పొందుతుందన్నారు. బూస్టర్ డోస్పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ డేటాను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోవిడ్కు వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ (NEGVAC), నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) కరోనాకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్కు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలపై అధ్యయనం చేస్తున్నాయని ఇటీవలే కేంద్రం పార్లమెంట్కు తెలిపింది.