న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో సమర్పించిన బడ్జెట్పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. అసలు ఆదాయమే లేదు, పన్ను మినహాయింపుల వల్ల ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారు? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. పేదలకు కేవలం హామీలు, మాటలే మిగిలాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి కలిగించేలా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు.
కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటకకు బడ్జెట్లో భారీ కేటాయింపులపై ఇతర రాష్ట్రాల నేతలు మండిపడుతున్నారు. కర్ణాటక, గుజరాత్ మధ్యలో ఉన్న మహారాష్ట్రకు బడ్జెట్లో ఏమీ లేదని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది విమర్శించారు. కేంద్రం నుంచి అందే వరాల బరువుతో ‘గిఫ్ట్ సిటీ’ నలిగిపోతున్నదని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. దేశానికి మేలు కలిగేలా బడ్జెట్ ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నదంటూ పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.