Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 723భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ఇంటిని కూల్చలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం తెలిపారు. సర్వే బృందం అక్కడ నెలకొన్న పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ప్రాంతం నుంచి ఇప్పటివరకు 99 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.
మరోవైపు పట్టణంపై భారత అంతరిక్ష సంస్థ ఓ కొత్త రిపోర్ట్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు.. అంటే 12 రోజుల్లోనే జోషీమఠ్ పట్టణం 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయినట్లు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. కార్టోశాట్-2ఎస్ శాటిలైట్ ఈ చిత్రాలను తీసింది.