లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా శనివారం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాత పూర్వక అనుమతి లేనిదే ఉదయం ఆరు గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత మహిళలు పని చేయకూడదని పేర్కొంది. ఒకవేళ ఆయా వేళల్లో మహిళలు పని చేస్తే వారికి ఉచితంగా రవాణా, ఆహారం, తగిన పర్యవేక్షణ కల్పించాలని సంస్థలను ఆదేశించింది. అలాగే రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా కార్మికులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొంటే ఆయా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్కు, స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా ఎక్స్ప్రెస్ రిపోర్ట్ పంపాలని కోరింది.
మరోవైపు మహిళలకు భద్రత, సురక్షిత పని వాతావరణం కల్పించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మహిళల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం తెలిపింది. లైంగిక వేధింపులను నిరోధించేందుకు యాజమాన్యాలు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. దీని కోసం విధిగా ఫిర్యాదు వ్యవస్థను నిర్వహించాలని ఆదేశించింది. ఈ అంశంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా వెంటనే ఆ కంపెనీ లేదా సంస్థను మూసివేస్తామని హెచ్చరించింది.