న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ వాటి కోసం అదనపు మొత్తాన్ని వెచ్చించేందుకు జనం అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. 5జీ సేవలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నవారిలో 43% మంది ప్రస్తుతం 3జీ లేదా 4జీ సర్వీసులకు వెచ్చిస్తున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు సుముఖంగా లేరని ప్రముఖ ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.
5జీ సేవల్లోకి మారడం వల్ల కాల్డ్రాప్/కనెక్ట్, నెట్వర్క్ లభ్యత, లోస్పీడ్ లాంటి సమస్యలు పరిష్కారమయ్యేటట్టయితే ప్రస్తుత టారిఫ్ల కంటే అదనంగా 10% వరకు చెల్లిస్తామని 43% మంది.. 25 నుంచి 50% వరకు అదనంగా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నామని కేవలం 2% మంది చెప్పినట్టు శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదికలో ‘లోకల్ సర్కిల్స్’ వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5% మంది మాత్రమే ఈ ఏడాది 5జీ సేవల్లోకి మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే తమ వద్ద 5జీ డివైజ్లు ఉన్నాయని 20% మంది, ఈ ఏడాది చివర్లోగా 5జీ డివైజ్ను సమకూర్చుకొంటామని మరో 4% మంది తెలిపారు. వచ్చే ఏడాది 5జీ డివైజ్ను కొనుగోలు చేస్తామని 20% మంది చెప్పారు.