CEC Gyanesh Kumar : అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిమిత్తం సీఈసీ బృందం పశ్చిమబెంగాల్లో (West Bengal) పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్కుమార్ విలేకరులతో మాట్లాడారు.
పశ్చిమబెంగాల్లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే ఎన్నికల సంఘం (ECI) మొదటి ప్రాధాన్యమని ఆయన చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఎప్పటికీ తొలగించబోమని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ అమలవుతుందని అన్నారు.
ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడటం, అర్హులైన వారి పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడటమే ‘సర్’ బాధ్యత అని చెప్పారు. ఇక్కడ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయనేది రాష్ట్రప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చేపట్టే చర్యలపైన ఆధారపడి ఉంటుందన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని చెప్పారు.
ఓటర్లపైనా, ఎన్నికల అధికారులపైనా రాజకీయ నేతలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని అన్నారు. పశ్చిమబెంగాల్లో దాదాపు 80 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిల్లో దాదాపు 61 వేలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా వెబ్కాస్టింగ్ ప్రక్రియను అమలుచేయనున్నట్లు తెలిపారు.