ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఆగమేఘాలమీద విద్యుత్తు పనులు షురూ
భువనేశ్వర్, జూన్ 26: ద్రౌపది ముర్ము.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి.. గతంలో గవర్నర్గానూ పనిచేశారు. అయితే ఆమె సొంతూరుకు ఇప్పటి వరకూ కరెంటు లేదు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలో ఉపర్బేద అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం పరిధిలో దుండూర్సాహి, బడాసాహి అనే రెండు కుగ్రామాలున్నాయి. వీటి జనాభా దాదాపు 3,500 మంది. అయితే బడాసాహి అంతటా కరెంటు ఉన్నా ద్రౌపది ముర్ము పూర్వీకులు నివసించిన దుండూర్సాహిలో మాత్రం కరెంటు లేదు.
తమకూ కరెంటు సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్థులు ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పేరును ప్రకటించగానే అధికారులు కండ్లు తెరిచారు. దుండూర్సాహికి విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి ఆగమేఘాలమీద పనులు ప్రారంభించారు.