Yogi Adityanath | శ్రామిక మహిళల భద్రత పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల అనుమతి లేకుండా రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు వారితో పని చేయించుకోరాదని వివిధ పారిశ్రామిక సంస్థలను ఆదేశించారు. మహిళా సాధికారత కోసం ఇంతకుముందు యోగి సర్కార్ రూ.75.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. జిల్లా స్థాయిలో మహిళలకు మద్దతుగా సైబర్ సపోర్ట్ డెస్క్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిఫారసు చేశారు.
వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీసు అయినా సరే.. మహిళా ఉద్యోగుల రాతపూర్వక హామీ ఇచ్చాకే రాత్రి ఏడు గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు వారితో పని చేయించుకోవాలని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వర్క్ ఫ్రం ఆఫీస్ అయితే మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాబ్ ఫెసిలిటీ కల్పించాలని కంపెనీల యాజమాన్యాలను ఆదేశిస్తూ కార్మిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే కార్మిక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నైట్ డ్యూటీ చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఆహారం, తాగునీటి వసతులు కల్పించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులు జరక్కుండా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కంపెనీలు, సంస్థలను ఆదేశించారు. బాత్రూమ్లు, చేంజింగ్ రూమ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆఫీసులో కనీసం నలుగురు మహిళా ఉద్యోగినులు ఉండేలా చర్య తీసుకోవాలని తెలిపారు.