PM Modi : ఉగ్రవాదం (Terrorism) విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి స్పష్టంచేశారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrhim) తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీ కండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు.
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్కు మలేషియాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. ఇరు దేశాలు విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై తమ సందేశం స్పష్టంగా ఉందని అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరికి, రాజీ వైఖరికి తావులేదని స్పష్టంచేశారు.
భారత్-మలేషియా దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ఇరుదేశాల ప్రజల మధ్య లోతైన ఆత్మీయ బంధం ఉన్నదని ప్రధాని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారిందని పేర్కొన్నారు. భారత్-మలేషియా మధ్య ఆరు కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. అంతకుముందు కౌలాలంపూర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.