న్యూఢిల్లీ: ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విమర్శలు వెల్లువెత్తడంతో బుధవారం జారీ చేసిన ఉత్తర్వును జంతు సంక్షేమ బోర్డు ఉపసంహరించుకుంది. కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నాం’ అని బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా పేర్కొన్నారు.
కాగా, వాలంటైన్స్ డే రోజున రోడ్డుపై కనిపించే ప్రేమ జంటలకు బంజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థ కార్యకర్తలు బలవంతంగా పెళ్లిళ్లు చేయడంతోపాటు వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, ఫిషరీస్ మంత్రి పరసోత్తమ్ రూపాలా నేతృత్వంలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) బుధవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. పశ్చిమ సంస్కృతి విస్తృతి వల్ల భారతీయ వేద సంప్రదాయాలు అంతరించిపోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’ గా జరుపుకోవాలని సూచించింది. దీని వల్ల భావోద్వేగ గొప్పతనం తెలియడంతోపాటు వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని పేర్కొంది.
మరోవైపు జంతు సంక్షేమ బోర్డు జారీ చేసిన ఈ ఉత్తర్వుపై విమర్శలు వచ్చాయి. గోమాత అయిన ఆవును ఆ ఒక్క రోజే హగ్ చేసుకుని గౌరవించాలనడం తగదంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో సహా పలువురు నేతలు మండిపడ్డారు. ఆవును ఎల్లప్పుడూ ప్రేమించవచ్చంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
The appeal issued by the Animal Welfare Board of India for celebration of Cow Hug Day on 14th February 2023 stands withdrawn. pic.twitter.com/5MvEbHPdBZ
— ANI (@ANI) February 10, 2023