బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు కరోనా రోజువారీ కేసులు పది వేలకు సమీపిస్తున్నాయి. మరోవైపు ఆంక్షలు, నిబంధనలను లెక్కచేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్, భారీ నిరసన ర్యాలీని ఆదివారం ప్రారంభించింది. తాగునీటి ప్రాజెక్ట్ కోసం ‘మా నీరు.. మా హక్కు’ నినాదంతో రామనగర జిల్లాలో పది రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టుంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్, ఆ పార్టీ సీనియర్, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర నేతలతోసహా వేలాది మంది కార్యకర్తలు ఈ నిరసన పాదయాత్రలో పాల్గొన్నారు. పది రోజుల పాటు వంద కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగి బెంగళూరులో ముగిసేలా షెడ్యూల్ను రూపొందించారు.
కాగా, కరోనా నిబంధనలు, వారాంతపు కర్ఫ్యూను కాంగ్రెస్ నేతలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమ ర్యాలీని కాంగ్రెస్ నేతలు సమర్థించుకున్నారు. ‘ఇక్కడ (రామనగర జిల్లా)లో కరోనా లేదు’ అని డీకే శివ కుమార్, సిద్ధ రామయ్య మీడియాతో అన్నారు. ‘మేము నీటి కోసం పాదయాత్ర చేస్తున్నాం. మమ్మల్ని ఆపాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ, ఇక్కడ కరోనా వైరస్ లేదు. ఎటువంటి వ్యాధి లేదు. వారు కేవలం 144 సెక్షన్ విధించారు (పెద్ద సమావేశాలను నిషేధించడానికి)’ అని శివకుమార్ చెప్పారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీని చేపట్టడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంలో శివకుమార్ నీటి వనరుల మంత్రిగా ఉన్నారని, అప్పుడు ఆయన ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.