లతేహర్, ఆగస్టు 26: జార్ఖండ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ మండిపడ్డారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. లతేహర్ పట్టణంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రత్యర్థులు(బీజేపీ) రాజకీయంగా తమను ఎదుర్కోలేక సీబీఐ, ఈడీ, లోక్పాల్, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని సొరేన్ తేల్చిచెప్పారు.
జేఎంఎం, కాంగ్రెస్ నేతల భేటీ
మైనింగ్ లీజు వ్యవహారంలో సొరేన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ నేతలు రాంచీలోని సొరేన్ నివాసంలో శుక్రవారం సమావేశమయ్యారు. ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేకుండా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.