ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో దగ్ధమవుతున్నాయి. దీంతో అటు కంపెనీలు, ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక.. ప్రమాదాలు కూడా పెరుగుతుండటంతో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేసి, లోపం ఎక్కడో సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే కంపెనీలకు కీలక ఆదేశం జారీ చేసింది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల లాంఛింగ్ను ఆపేయాలని కేంద్రం సూచించింది. రోజు రోజుకీ ఎలక్ట్రిక్ టూ వీలర్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ ఢిల్లీ వేదికగా ఓ సమావేశం నిర్వహించింది. ఇందులోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక.. ప్రమాదాలు జరగని కంపెనీలు కూడా ఈ సారి ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయడానికి వీలులేదని కేంద్రం తెగేసి చెప్పింది.
”కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు లాంచ్ చేయవద్దని మౌఖిక ఆదేశాలిచ్చాం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎందుకు దగ్ధమవుతున్నాయి? వాటికి గల కారణాలను పరిశోధించాలి. అధ్యయనం చేయాలి. అలాగే వాటిని ఆపడానికి ఏం చేయాలి? అన్న అంశాలపై స్పష్టత వచ్చేంత వరకూ ఎలక్ట్రిక్ వాహనాల లాంచింగ్ వద్దని సూచించాం” అని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ 7,000 స్కూటర్ల రీకాల్
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఒక్కసారి వాటిని సరి చేసుకోవాలని, లేని పక్షంలో తాము రీకాల్ చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ 7,000 ఎలక్ట్రిక్ టూవీలర్ల రీకాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకినోవా కంపెనీకి చెందిన 3,215 స్కూటర్లు, ప్యోర్ ఈవీ సంస్థకు చెందిన 2,000 స్కూటర్లు, ఓలాకు చెందిన 1,441 స్కూటర్లను రీకాల్ చేసినట్లు తెలిసింది.