దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు అగ్నిపథ్పై మొండిగా వ్యవహరిస్తున్నది. అగ్నిపథ్ను ఉపసంహరించుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అగ్నివీరుల నియామకాలకు త్రివిధ దళాలు ఆదివారం షెడ్యూల్ను ప్రకటించాయి. నిరసనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డవారిని ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలో చేర్చుకోబోమని కేంద్రం హెచ్చరించింది. మరోవైపు, అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘దేశంలోని నిరుద్యోగ యువత ఇలా ఎందుకు రోడ్డెక్కిందో కేంద్రం అర్థం చేసుకోవాలి’ అని బీహార్కు చెందిన ఆర్మీ ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేశారు. ఆర్మీలో శాశ్వత ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా తొలగించే కుట్రే అగ్నిపథ్ అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంపై యువతకు విశ్వాసం పోయిందన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 19: అగ్నిపథ్పై వెనక్కు తగ్గబోమని కేంద్రం స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో సైన్యం సగటు వయస్సు తగ్గించడం, సాంకేతిక వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా అగ్నిపథ్ను తీసుకువచ్చినట్టు తేల్చిచెప్పింది. సైన్యంలో సంస్కరణలపై రెండేండ్ల పాటు అధ్యయనం చేసిన తర్వాతనే అగ్నిపథ్ను తీసుకువచ్చామని మిలిటరీ వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. తర్వాత, అనిల్ పురి, త్రివిధ దళాలకు చెందిన అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. నిరసనల నేపథ్యంలో ‘అగ్నిపథ్ను వెనక్కు తీసకోవడంపై కేంద్ర ఏమైనా ఆలోచన చేస్తున్నదా’ అన్న ప్రశ్నకు ఆయన ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. ‘ఎందుకు ఉపసంహరించుకోవాలి’ అని ఎదురు ప్రశ్నించారు.
నిరసనల్లో పాల్గొంటే.. చేర్చుకోం..
అగ్నివీరులకు రిజర్వేషన్ లాంటి వెసులుబాట్లు నిరసనల వల్ల తీసుకొన్న నిర్ణయాలు కావని, కేంద్రం ముందు నుంచే ఆలోచిస్తున్నదని అనిల్ పురీ చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్ని హింసకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన యువకులను త్రివిధ దళాల్లో చేర్చుకోబోమన్నారు. అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్థులు.. ‘మేం ప్రభుత్వ ఆస్తుల దహనానికి పాల్పడలేదు. హింసలో పాల్గొనలేదు. మాపై కేసుల్లేవు’ అని రాతపూర్వకంగా స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలని అనిల్ పురీ తెలిపారు. అగ్నివీరులుగా నియామకం సమయంలో అభ్యర్థులపై పోలీస్ వెరిఫికేషన్లో కేసులు ఉన్నట్టు తేలితే వారిని నియమించుకోబోమని స్పష్టం చేశారు. అగ్నిపథ్ నియామకాలు భవిష్యత్తులో పెరుగుతాయన్నారు.
అగ్నివీరుల నియామకంపై త్రివిధ దళాలు ఆదివారం షెడ్యూల్ను ప్రకటించాయి.
ఆర్మీ
ఆర్మీలో అగ్నివీరుల నియామకంపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ ర్యాలీలు ఉంటాయన్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి మొదటి బ్యాచ్ కింద 25 వేల మందికి, రెండో బ్యాచ్కు ఫిబ్రవరి 23 నుంచి శిక్షణ ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
నౌకాదళం
అగ్నివీరుల నియామకంపై నౌకాదళం ఈ నెల 25న మార్గదర్శకాలు జారీ చేస్తుందని వైస్ అడ్మిరల్(పర్సనల్) దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. మొదటి బ్యాచ్కు నవంబర్ 21 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుందన్నారు.
వైమానిక దళం
ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరుల నియామకానికి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా వెల్లడించారు. మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష ఉంటుందన్నారు. వచ్చే నెల 24 నుంచి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబర్ 30 నుంచి మొదటి బ్యాచ్కు శిక్షణ ఇవ్వాలని ప్రణాళికల్లో ఉన్నట్టు తెలిపారు.