న్యూఢిల్లీ: కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న (Doctors protest) బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అల్టిమేటమ్ జారీ చేసింది. దేశాన్ని కుదిపేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని హత్యాచారం కేసుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్లో 28 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో వైద్య సేవలకు విఘాతం ఏర్పడటంతోపాటు 23 మంది మరణించినట్లు చెప్పింది. అలాగే వైద్యుల భద్రతా చర్యల కోసం నిధులు మంజూరు చేశామని, జిల్లా కలెక్టర్లు దీనిని పర్యవేక్షిస్తారని అఫిడవిట్లో పేర్కొంది.
కాగా, బెంగాల్ డాక్టర్లు తమ నిరసన విరమించాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మరోసారి కోరారు. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు వైద్యులు విధులకు హాజరైనట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తాము తెలియజేస్తామని అన్నారు. డాక్టర్లకు భద్రతా సౌకర్యాలు కల్పించినప్పటికీ విధులకు దూరంగా ఉంటే భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ‘వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని మేం కోరుకుంటున్నాం. వారు సేవలందించే వ్యవస్థలో ఉన్నారు. మేం సౌకర్యాలు అందిస్తాం. కానీ వారు ప్రతిస్పందించాల్సి ఉంది. వైద్యులు తిరిగి విధుల్లోకి రాకపోతే ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా మేం ఆపలేం’ అని అన్నారు.