న్యూఢిల్లీ: వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.
ఇక నుంచి డాక్టర్లందరూ రోగులకు విధిగా జనరిక్ మందులనే సిఫార్సు చేయాలని, దానిని పాటించని వారికి జరిమానాలు విధిస్తామని, అవసరమైతే వారి లైసెన్స్లను కూడా రద్దు చేస్తామంటూ ఈ నెల ప్రారంభంలో ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫార్మా కంపెనీల నుంచి బహుమతులు స్వీకరించరాదని, ఏ ఔషధ బ్రాండులకూ ప్రచారం చేయరాదని స్పష్టంచేసింది. అయితే దీనిపై ఐఎంఏ, ఐపీఏ అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. నాణ్యమైన మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. అలాగే ఫార్మాకంపెనీలు స్పాన్సర్ చేసే సదస్సులకు హాజరుకాకుండా వైద్యులపై నిషేధం విధించే నిర్ణయాన్ని కూడా ఉపసంహరించాలని కోరాయి.