NExT | న్యూఢిల్లీ: 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులకు నిర్వహించాల్సిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT)ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గురువారం వెల్లడించింది. అయితే ఈ నెల 28న నిర్వహించాల్సిన మాక్ నెక్స్ట్ పరీక్ష నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నెక్ట్స్ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఎంసీ తెలిపింది. నెక్ట్స్ మార్గదర్శకాలను ఎన్ఎంసీ ఇటీవలే విడుదల చేసింది. ఏటా రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు, దేశంలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకునేందుకు నెక్ట్స్ ఉత్తీర్ణత తప్పనిసరి. విదేశాలకు చెందిన మెడికల్ గ్రాడ్యుయేట్లు భారత్లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నా నెక్ట్స్లో ఉత్తీర్ణత కావాల్సిందే.