Nitish on BJP | రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడి బీజేపీని గద్దె దించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సూచించారు. 2024 లో బీజేపీని గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. ఇదే సమయంలో బిహార్ సీఎం పదవికి పోటీలో ఉండనని కూడా స్పష్టం చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఎదుర్కొంటామని చెప్పారు. సోమవారం పాట్నాలో జరిగిన మహాకూటమి ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ మాట్లాడారు. సమావేశంలో చర్చించిన విషయాలను ఆర్థిక మంత్రి విజయ్ చౌదరి మీడియాకు చెప్పారు.
కేంద్రంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నదని నితీష్ తెలిపారు. బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తనకు మరోసారి సీఎం పదవిలోకి రావాలన్న కోరికగానీ, ప్రధాని పీఠం ఎక్కాలన్న కోరికగానీ లేవన్నారు. 2025 లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలోనే పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మద్యనిషేధంపై చర్చ సందర్భంగా మద్యనిషేధానికి అన్ని పార్టీ మద్దతు లభించిందని, ఇప్పుడు ప్రశ్నించడంలో ఎలాంటి అర్థం లేదన్నారు.