Chirag Paswan to Nitish | బీహార్ సీఎం నితీశ్కుమార్పై లోక్జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్కు దమ్ముంటే నేరుగా బీజేపీతో తలపడాలని సవాల్ చేశారు. నితీశ్కుమార్ ప్రజాదరణకు గండికొట్టేందుకు జరిగిన కుట్రలో తన ప్రమేయం ఉందని ఆరోపించడానికి బదులు బీజేపీతో తేల్చుకోవాలని సోమవారం మీడియాతో అన్నారు. తన కంటే నితీశ్ కుమార్ సొంత మనుషుల నుంచే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో శరద్ యాదవ్, జార్జి ఫెర్నాండేజ్లను తాజాగా జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ను అవమానించారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. `సొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు అవినీతికి పాల్పడినట్లు గతంలో ఎన్నడూ వినలేదు. కానీ, నితీశ్ కుమార్ మాత్రం మీరు (ఆర్సీపీ సింగ్) అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు` అని అన్నారు.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ సారధ్యంలోని ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలిపింది. వారిలో అత్యధికులు బీజేపీ తిరుగుబాటు నేతలే కావడం గమనార్హం. ఫలితంగా బీహార్ అసెంబ్లీలో జేడీయూ బలం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ `చిరాగ్ మోడల్` కుట్ర చేస్తున్నదని జేడీయూ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ ఆరోపించారు.
`ఒకవేళ చిరాగ్ మోడల్ అమలైతే.. అది `బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్` నినాదానికి కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం కోసమే మా విజన్ ఉంటుంది. కానీ, సీఎం ఏనాడూ దాన్ని గౌరవించలేదు. జేడీయూ ఓటమికి తమ పార్టీని నిందించడం నితీశ్ మానుకోవాలి. జేడీయూ చీలిపోయిన పార్టీ. ఆర్సీపీ సింగ్ వైదొలిగేలా చేశారు. కానీ, నితీశ్ కుమార్ వంటి వారికి లలన్, ఉపేంద్ర కుశ్వాహా వంటి వారు అవసరం` అని చిరాగ్ పాశ్వాన్ ఎద్దేవా చేశారు.
తన హయాంలో బీహార్లో పరివర్తన తీసుకొచ్చామని సీఎం నితీశ్ కుమార్ వాదనను చిరాగ్ పాశ్వాన్ కొట్టి పారేశారు. నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో బీహార్ అట్టడుగు స్థాయికి పడిపోవడమే దీనికి నిదర్శనం అన్నారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్ర డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీకి వెల్లడించే అవకాశాన్ని నితీశ్ కుమార్ కోల్పోయారని చెప్పారు. నితీశ్కుమార్ అహంకారపూరిత వైఖరి వల్ల బీహార్ బాధపడుతున్నదన్నారు.