పట్నా : బిహార్ క్యాబినెట్లో చోటుదక్కకపోవడంతో అసంతృప్తుల వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. లేషి సింగ్ మరోసారి మంత్రివర్గంలో చేరడంతో పాటు తనకు మొండిచేయి చూపడం పట్ల జేడీయూ సీనియర్ ఎమ్మెల్యే బిమా భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిపదవులు దక్కని వారిలో అసమ్మతి స్వరం పెరగిన నేపధ్యంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ప్రతి సమయంలో మంత్రి పదవులు ఇవ్వలేమని నితీష్ అన్నారు. బిమా భారతి గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారని గుర్తు చేస్తూ ఈ తరహా ప్రవర్తన సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ ఆమెతో సంప్రదింపులు జరుపుతుందని, ఆమె అర్ధం చేసుకుంటే మంచిదని..లేనిపక్షంలో ఆ పార్టీ..ఈ పార్టీలోకి వెళతానంటే అది ఆమె ఇష్టమని స్పష్టం చేశారు. లేషి సింగ్ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని బిమా భారతి ఇప్పటికే పార్టీని హెచ్చరించారు. ప్రతిసారి లేషీ సింగ్ మంత్రివర్గంలో ఎలా తీసుకుంటున్నారు..ఆమె తన నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నా అందలం ఎక్కిస్తున్నారని భారతి మండిపడ్డారు.
లేషి సింగ్ను క్యాబినెట్ నుంచి తొలగించని పక్షంలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. తన ఆరోపణలు అవాస్తవమని తేలితే తాను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని బిమా భారతి తేల్చిచెప్పారు. మరోవైపు లేషిసింగ్ 2013, 2014, 2019లో మంత్రిగా ఉన్నారని ఇలాంటి ఆరోపణలు ఆమెపై ఎన్నడూ రాలేదని ఇవన్నీ అర్ధరహితమని సీఎం నితీష్ కుమార్ తోసిపుచ్చారు. భారతిని తాము రెండు సార్లు మంత్రిగా చేశామని, ఆమెకు చదవడం రాకపోయినా నేర్పించి ఎదగిలే కృషిచేశామని అలాంటిది ఆమె ఇప్పుడిలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.