పట్నా : మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు. కాషాయ పార్టీ నిర్వాకం రాజ్యాంగబద్ధమైనదేనా అని నితీష్ ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షం ఏకతాటిపైకి వస్తే దేశంలో విభిన్న ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. మణిపూర్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని ప్రస్తావిస్తూ బిహార్లో తాను ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి మహాకూటమి సర్కార్ను ఏర్పాటు చేసే క్రమంలో ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు తమను కలిసి పార్టీతోనే కలిసి ప్రయాణిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాగా మణిపూర్లో ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం బీజేపీలో చేరడంతో నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీ(యూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆగస్ట్ 25న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన జేడీ(యూ) ఏకైక ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు.