CM Nitish Kumar | పాట్నా: బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో తదుపరి చోటుచేసుకోబోయే పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం నుంచి నితీశ్ వైదొలగడం ఖాయమని, ఆయన తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. నితీశ్ ఆదివారం రోజున 9వసారి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ ప్రమాణం చేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి.
మరోవైపు లాలూ యాదవ్ బల సమీకరణ యత్నాల్లో భాగంగా నాలుగు సీట్లున్న జీతన్రాం మాంఝీ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. జీతన్రాం ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉన్నారు. ఈ పరిణామాలపై సుశీల్ మోదీ స్పందిస్తూ.. ‘మూసుకున్న తలుపులు తెరుచుకోవచ్చు’, ‘రాజకీయాల్లో ఏమైనా జరుగొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నితీశ్ తన వైఖరిని స్పష్టం చేయాలని లాలూ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు, నితీశ్ గనుక రాజీనామా చేసి స్నేహ హస్తం అందిస్తే.. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రతిపాదించడంలో ఆలస్యం చేయకూడదని బీజేపీ అధిష్టానం బీహార్ నేతలను ఆదేశించింది.
పాట్నాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ పరిణామాలను గమనిస్తున్నామని, ఈ సారి నితీశ్కుమార్ తిరిగి బీజేపీ కూటమిలో చేరడం అంత సులభం కాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈసారి ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ (ఆర్జేడీ) వాడు అని అన్నారు. గత ఏడాది జేడీయూ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న ఉపేంద్ర కుశ్వాహా మాట్లాడుతూ.. ‘నితీశ్కుమార్ ఎన్డీయే కూటమిలో చేరడంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే మేము బీజేపీతో కలిస్తే లోక్సభ ఎన్నికల తరువాత కూడా ఆ ఐక్యత కొనసాగుతుందా అన్నది అతి పెద్ద ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. రెండు మూడు రోజుల్లో నితీశ్ ఎన్డీయే గూటికి చేరడం మాత్రం ఖాయమని ఈ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, 10 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్టు విశ్వయనీయ వర్గాలు వెల్లడించాయి.
ఆర్జేడీ నేత లాలూ యాదవ్ ఇల్లు పార్టీ నేతల రాకపోకలతో శుక్రవారం సందడిగా మారింది. ఎలాగైనా ప్రభుత్వం చేజారి పోకుండా చూసేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆయన హెచ్ఏఎం పార్టీ నేత జీతన్రాం మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీకి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్టు వెల్లడించాయి. అయితే ఈ ఆఫర్ను సంతోష్ మాంఝీ తిరస్కరించారు.
నితీశ్కుమార్ ‘ఇండియా’ కూటమిలోనే కొనసాగితే ఆయన ప్రధాని అయ్యేందుకు అవకాశాలు ఉండేవని సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానెల్తో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమిలో ప్రధాని పదవికి ఎవరినైనా పరిశీలించే అవకాశాలున్నాయి. సరైన మద్దతు లభిస్తే నితీశ్కుమార్ ప్రధాన పోటీదారుగా ఉండేవారు’ అని అన్నారు. ఇండియా కూటమి ఏర్పాటుకు నితీశ్ ప్రోద్బలమే కారణమని, ఆయన తమతోనే ఉండటం మంచిదని అన్నారు.