న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డాయి. దేశంలో విపక్షం లేకుండా చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర పన్నుతున్నదని దుయ్యబట్టాయి.
నేను మహాకూటమిలో చేరినందుకే: నితీశ్కుమార్
బీహార్లో మళ్లీ అధికారం దక్కించుకొనేందుకే సీబీఐ, ఈడీలతో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఆరోపించారు. 2017లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి ఘటనలే జరిగాయని గుర్తుచేశారు. 2017లో కూడా అప్పటి డిఫ్యూటీ సీఎం తేజస్వీకి సీబీఐ, ఈడీ సమన్లు జారీచేయటంతో కేసుల నుంచి బయటపడేవరకు పదవి నుంచి తప్పుకోవాలని నాటి సీఎం నితీశ్కుమార్ సూచించారు. అందుకు తేజస్వీ అంగీకరించకపోవటంతో నితీశ్ ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వా రద్దుచేసి మరుసటి రోజే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మళ్లీ సీఎం అయ్యారు. కాగా, ఈసారి బీజేపీ కుట్రలను సాగనివ్వబోమని నితీశ్ స్పష్టంచేశారు. తాను మహాకూటమిలో చేరినందుకే లాలూ కుటుంబంపై ఈడీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.
విపక్షాలను బీజేపీ అణచివేస్తున్నది: ప్రియాంక
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విపక్ష నేతలను బీజేపీ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వాద్రా ఆరోపించారు. తేజస్వీయాదవ్కు సీబీఐ సమన్లు జారీచేయటంపై శనివారం ఆమె ట్విట్టర్లో స్పందించారు. ‘గట్టిగా మాట్లాడే విపక్ష గొంతుకలను చూసి బీజేపీ ఎందుకు భయపడుతున్నది? బీజేపీ ప్రభుత్వం విపక్షాలను అణిచివేసే రాజకీయంలో మునిగిపోయింది. తేజస్వీ యాదవ్కు సీబీఐ నోటీసు కూడా ఈ రాజకీయాల్లో భాగమే. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటారు’ అని స్పష్టంచేశారు.