CM Nitish Kumar | పాట్నా : జనతా దళ్(యునైటెడ్) ఆధ్వర్యంలో మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి వేడుకలను మంగళవారం బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీయూ భారీ ర్యాలీ తీసింది. ఈ వేడుకల్లో జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొని మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పీఎం నితీశ్ అంటూ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు.
అనంతరం సీఎం నితీశ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన గురించి తక్కువగా రాయాలని మీడియాకు సూచించారు. తన కంటే మాజీ సీఎం కర్పూరి ఠాకూర్పై దృష్టి కేంద్రీకరించి, ఆయన చేసిన సేవ గురించి రాయాలన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనితో ఆనందంగా ఉన్నానని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ఉన్న నితీశ్.. తనకు ప్రత్యేక కోరికలు ఏమి లేవంటూ పేర్కొన్నారు.
ఇక పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది దాకా తరలివచ్చారు. ఈ జనాన్ని చూసి నితీశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త నిత్యం శాంతియుతంగా ఉండాలని సూచించారు. హిందూ, ముస్లింల పేరిట గొడవలకు పాల్పడొద్దని కోరారు. కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా ఆయన పూర్వీకుల నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారని నితీశ్ కుమార్ గుర్తు చేశారు. ఇక నితీశ్ ప్రసంగం కొనసాగినంత సేపు దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైషా హో నినదించారు.