పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ను (Nitish Kumar) దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పట్నాలో ఆదివారం పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. జేడీ(యూ) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై హాట్ డిబేట్ సాగుతోంది. నితీష్ కుమార్ దేశానికి సమానత్వ పాఠం బోధించారని పోస్టర్లో ప్రశంసలు గుప్పించారు.
సామాజిక సంస్కరణల కోసం బిహార్ సీఎం నితీష్ ఎన్నో చర్యలు చేపట్టారని, మహాత్మా గాంధీ బాటలో ఆయన నడుస్తున్నారని జేడీయూ నేతలు చెబుతున్నారు. నితీష్ కుమార్ను రెండో గాంధీగా అభివర్ణిస్తున్న పోస్టర్లపై ఇతర పార్టీలు స్పందించాయి. నితీష్ కుమార్ భక్తులు ఈ పోస్టర్లు అతికించారని, కానీ నితీష్ భక్తులు మహాత్మా గాంధీని కించపరచడం మానుకోవాలని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ పేర్కొన్నారు.
గాంధీ వంటి మహానుభావులు వేయేండ్లకు ఒకరు మాత్రమే పుడతారని అన్నారు. నితీష్ కుమార్ పోస్టర్పై బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. నితీష్ కుమార్ను మహాత్మా గాంధీతో పోల్చడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతినిది కుంతల్ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాలుగా లాలూ ప్రసాద్ యాదవ్ను వ్యతిరేకించిన నితీష్ ప్రధాని పదవి కోసం ఇప్పుడు ఆయన ఒడిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ అత్యంత అవకాశవాదని ఆరోపించారు.
Read More :
Operation Ajay | ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి నాలుగో ఫ్లైట్.. స్వదేశానికి మరో 274 మంది